కలం, కరీంనగర్ బ్యూరో: వర్షాకాలం నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో రోడ్లపై వరద నిల్వకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని రాంనగర్, రేకుర్తి, మంచిర్యాల చౌరస్తా, కలెక్టరేట్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ నాలాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా వర్షాకాలంలో నీరు రోడ్లపైకి రాకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైనేజీలు, నాలాల్లో వర్షపు నీరు నిరంతరాయంగా ప్రవహించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మురుగు లేదా వర్షపు నీరు నిల్వ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కీలక జంక్షన్ల వద్ద నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరంపై కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగరపాలక సంస్థ కమిషనర్ చర్చించారు.

