కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల అమలులో కరీంనగర్ (Karimnagar) జిల్లాను అగ్రభాగాన నిలపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా (Sandeep Kumar Sultania) మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడమే అధికారుల ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రజలకు సేవలు అందించడం అదృష్టంగా భావించాలన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని సమస్యల పరిష్కారం నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతోందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్నారు.
ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు..
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను కరీంనగర్ (Karimnagar) జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, అద్దె బస్సుల నిర్వహణ వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది.
Read Also: వైభవ్కు ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్.. ఎందుకో చెప్పిన ఈసీబీ
Follow Us On: Instagram

