కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆయా గ్రామాల్లో వర్షాల కోసం గ్రామస్తులు కప్ప తల్లి ఆటలు ఆడి దేవతలకు జలాభిషేకాలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని డిచ్ పల్లి మండలంలోని ముల్లంగిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా కప్ప తల్లి ఆటలు (Kappathalli Ritual) ఆడారు. కప్పను కట్టిన కట్టెను ఊరంతా తిప్పుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆ కప్ప పై నీళ్ళు పోశారు. గ్రామ దేవతలకు సైతం గంగాజలంతో అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. వేడుకల్లో సర్పంచ్ సూదం శ్రీనివాస్, ఉప సర్పంచ్ అశోక్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు లోలం నితిన్, క్యాషియర్ శేఖర్, గ్రామస్థులు నవీన్, సుమన్, ప్రశాంత్ ఉన్నారు.
ఇటు జక్రాన్ పల్లి మండలంలోని చింతలూర్ గ్రామస్థులు కూడా కప్పతల్లి ఆట ఆడారు. సర్పంచ్ నాగుల శ్రీనివాస్, యువకులు, గ్రామస్థులు కలిసి ఇంటింటికి వెళ్లి కప్పతల్లి ఆట ఆడగా కప్పతల్లికి నీళ్లు పోసి గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ వర్షాలు కురువక పోవడంతో సమృద్ధిగా వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని వరుణ దేవుడిని వేడుకున్నారు.

