కలం, భువనగిరి: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సోమవారం యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, బౌద్ధ క్షేత్రాల సంరక్షణ, పునరుద్ధరణ పనులకు మంత్రి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా సాగుతున్న భువనగిరి కోట (Bhuvanagiri Fort) అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆయా క్షేత్రాలలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పునరుద్ధరణ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు ప్రారంభించనున్నారు.
అనంతరం చారిత్రక కొలనుపాకలోని జైన మందిరం, సోమేశ్వరాలయం పరిసరాల్లో పర్యాటక రంగ అభివృద్ధి, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రి జూపల్లి (Jupally Krishna Rao) పర్యటన నేపథ్యంలో యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం, పర్యాటక, పురావస్తు శాఖల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read Also: చిట్చాట్లో బాంబు పేల్చిన గుత్తా
Follow Us On : WhatsApp

