కలం, రఘునాథపల్లి : వానకాలం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి (CI Srinivas Reddy) సూచించారు. రఘునాథపల్లి, లింగాల గణపురం, చిల్పూర్ మండలాల రైతులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకాలు చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేసి షాపులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా కొనుగోలు రశీదు తీసుకోవాలని, అందులో బ్యాచ్ నెంబర్, రైతు వివరాలు ఉండాలని సూచించారు. అపరిచితులు గ్రామాలలో తిరుగుతూ నకిలీ విత్తనాలు విక్రయించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలు, ఎరువుల రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉంటేనే నష్టాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

