కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఐడీఏ బొల్లారం (IDA Bollaram) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం బతుకుదెరువు నిమిత్తం సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారానికి వలస వచ్చి నివాసముంటోంది. రోజువారీ లాగే బాలిక తల్లిదండ్రులు ఉదయం పనికి వెళ్లారు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది.
ఇదే అదనుగా చూసుకున్న ఖాసీం (50) అనే వ్యక్తి సదరు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలు జరిగిన విషయాన్ని వారికి వివరించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఐడీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు ఖాసీం పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

