కలం, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కళ్లు తిరిగి పడిపోయిన మహిళకు గుండె పోటు వచ్చిందనుకొని కొందరు సీపీఆర్ (CPR) చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఆ సీపీఆర్ రేంజ్కు ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. తీరా ఆస్పత్రికి వెళ్లాక ఆమెకు అసలు గుండెపోటే రాలేదని తేలింది. మధ్యప్రదేశ్లోని కైలారస్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కౌలారస్కు చెందిన లలిత టీచర్గా పని చేస్తోంది. స్కూటర్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎండ తీవ్రతతో ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించి సీపీఆర్ చేయడం మొదలుపెట్టారు.
కొద్దిసేపటి తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన డాక్టర్లు అసలు ఆమెకు గుండెపోటు రాలేదని నిర్ధారించారు. సీపీఆర్ సరిగ్గా చేయకపోవడం, ఒత్తిడి ఎక్కువ కావడంతో లలిత రెండు పక్కటెముకలు విరిగినట్లు తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ప్రాణాలు కాపాడదామని సీపీఆర్ చేసి ప్రాణాల మీదకు తెచ్చారంటూ యువకులను విమర్శించారు. ఈ ఘటనతో అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ను శిక్షణ పొందిన వారు, లేదా సరైన విధానం తెలిసిన వారే చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

