కలం, జనగామ : జిల్లా (Jangaon) కేంద్రంలోని బాలాజీ నగర్లో శుక్రవారం ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ ఇల్లు అద్దెకు తీసుకునేందుకు వచ్చి, అదే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కొత్తపాడు గ్రామానికి చెందిన గుత్తా నవీత (34) అనే మహిళ శుక్రవారం ఉదయం జనగామ (Jangaon) బాలాజీ నగర్కు చేరుకుంది. అక్కడ ఒక ఇంటిని అద్దెకు కావాలని యజమానిని సంప్రదించింది. అయితే, కిరాయికి సంబంధించిన చర్చలు ముగిసి, ఇంకా ఇంట్లోకి అధికారికంగా ప్రవేశించక ముందే ఆమె అదే గదిలో విగతజీవిగా కనిపించింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఒక ఆత్మహత్య లేఖ లభించినట్లు సమాచారం. అందులో తన వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన రోజే, అదీ కిరాయికి దిగకముందే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడటం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఖమ్మం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చింది? ఆమె వెంట ఎవరైనా ఉన్నారా? లేదా ఒంటరిగానే వచ్చిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

