కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గడపకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చేరవేస్తున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ (Vodithala Pranav) అన్నారు. ఇల్లందకుంట మండల పరిధిలోని ఇల్లందకుంట, చిన్న కోమటిపల్లి, టేకుర్తి, బూజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి, శ్రీ రాములపల్లి, కనగర్తి, లక్ష్మాజీపల్లి, మల్యాల, వాగొడ్డు రామన్నపల్లి గ్రామాల్లో 24 కుటుంబాలకు రూ.8 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.
వెంటనే సమస్యల పరిష్కారం..
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. ప్రజలు తమ వద్దకు తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా అందిస్తున్నామని, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇదే సూచన చేశామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పంపిణీలో ఇల్లందకుంట దేవాలయ ఛైర్మన్ రామారావు, మండల అధ్యక్షుడు పెద్ది కుమార్, జిల్లా అధికార ప్రతినిధులు, డైరెక్టర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

