కలం, స్పోర్ట్స్: టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Table Tennis Federation of India)కు భారీ షాక్ తగిలింది. పాలనా సమస్యలను కారణంగా చూపుతూ కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ఫెడరేషన్ గుర్తింపును సస్పెండ్ చేసింది. దేశంలో టేబుల్ టెన్నిస్ పరిపాలనను తాత్కాలికంగా పర్యవేక్షించేందుకు అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘం (IOA)ను ఆదేశించింది. నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహించడంలో టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ విఫలమవడం కూడా గుర్తింపు సస్పెన్షన్కు ప్రధాన కారణాలలో ఒకటిగా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫెడరేషన్ పాలనా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై గతంలోనే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. అయితే టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అడ్హాక్ కమిటీ ఏర్పాటు
దేశంలో టేబుల్ టెన్నిస్ పరిపాలన సజావుగా కొనసాగేందుకు తాత్కాలిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ IOAను ఆదేశించింది. ఇందులో భాగంగా అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసి ఫెడరేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని సూచించింది. తాత్కాలిక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు విషయంలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ITTF)తో సంప్రదింపులు జరపాలని IOAకు సూచించింది. ఫెడరేషన్లో సక్రమమైన పాలనా వ్యవస్థ తిరిగి ఏర్పడే వరకు అడ్హాక్ కమిటీతో పాటు అవసరమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని పేర్కొంది. తదుపరి చర్యలను IOA, ITTF పరస్పర సంప్రదింపులతో కొనసాగించనున్నట్లు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ సమర్థవంతమైన పాలనా వ్యవస్థ పునరుద్ధరించే వరకు తాత్కాలిక పరిపాలనా వ్యవస్థ కొనసాగనుంది.

