పరిహారం కోసం పోరాటం..

కలం, మెదక్ బ్యూరో : 2025 జూన్ 30 న తేదీ.. దేశం మొత్తం ఉలిక్కిప‌డే సంఘ‌ట‌న జ‌రిగిన రోజు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడ‌లోని సిగాచి ఇండ‌స్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో (Sigachi Industries Tragedy) 54 కార్మికులు ప్రాణాలు కొల్పోయిన రోజు. ఈ విషాద‌కార సంఘ‌ట‌న జ‌రిగి దాదాపు 10నెలలు కావస్తున్నా, మరణించిన కార్మికుల కుటుంబాలకు నేటికీ పూర్తిస్థాయిలో న్యాయం జ‌ర‌గ‌లేదు. ప్రమాద సమయంలో ప‌ర్య‌టించిన ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన రూ.1 కోటి పరిహారం హామీ నేటికీ అమలు కాలేదు. దింతో ప్ర‌మాద బాధితులు పరిహారం కోసం పోరాటం చేయవలసిన ద‌య‌నీయ పరిస్ధితి ఏర్పడింది.

భారీ పేలుళ్లు ..54 మంది మృతి

గత ఏడాది జూన్ 30 ఉదయం సుమారు 9 గంటల సమయంలో పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియా లోని సిగాచి పరిశ్రమలో పెద్ద పేలుళ్లతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది (Sigachi Industries Tragedy). మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ (MCC) తయారీ ప్రక్రియలో ఫ్యాక్టరీలో రసాయన పదార్థాలు ప్రాసెస్ చేసే యూనిట్‌లో అకస్మాత్తుగా భారీ పేలుడు జరిగింది. భారీ పేలుళ్ల ధాటికి కంపెనీ స్లాబ్ ల‌తో స‌హ‌ కుప్పకూలింది. దీని వ‌ల్ల శిథిలాల కింద చిక్కుకొని పదుల సంఖ్యలో కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అగ్ని ప్ర‌మాద‌దాటికి అనేక మంది తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం 54 మంది కార్మికులు మృతి చెందారు

కోటి న‌ష్ట ప‌రిహ‌రం ప్రకటన.. కానీ

సిగాచి ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగిన ప్ర‌మాదం కార‌ణంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 54 మంది కార్మికుల కుటుంబాల‌ను అదుకొవడానికి కోటి రూపాయలు న‌ష్ట‌పరిహ‌రం ఇస్త‌మ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు 54 మందికి కుటుంబసభ్యులకు సుమారు 42 ల‌క్ష‌లు మాత్ర‌మే చెల్లించారు. కొంద‌రికి సినియారిటి ప్ర‌కారం, ప‌ర్మినెంట్ కార్మికులకు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించిన , చాల‌మందికి 42 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే న‌ష్ట‌ప‌రిహ‌రం ఇచ్చారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. అయితే సిగాచి కంపెనీ సొంతంగా ఇచ్చిన 25 లక్షలకు.. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని ఈ లెక్కలు చూపిస్తున్నారు. కార్మికుల శ్ర‌మను చ‌నిపోయిన త‌ర్వాత కుడా సిగాచి యాజ‌మాన్యం దోచుకుంది. కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బులను కూడా తీసుకువచ్చి కంపెనీ ఇచ్చే పరిహారంలో కలిపి చూపించడం యాజమాన్య కార్శికుల ప‌ట్ల చూపించిన అమానవీయతకు నిద‌ర్శ‌నంగా మిగిలింది. కార్మికుల హ‌క్కుగా రావ‌ల్సిన అమౌంట్ కాకుండా న‌ష్ట‌ప‌రిహ‌రంగా కోటి ఇవ్వ‌వ‌ల్సి ఉన్న.. మాట మార్చింది. అంతేకాక‌ ప్ర‌మాదం సంద‌ర్భంగా గాయ‌ప‌డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారం త‌ప్ప, పూర్తిగా ఇవ్వ‌లేదు సిగాచి సంస్ధ .ప్రమాదంలో ప్రాణుల‌తో బ‌య‌ట‌ప‌డి.. గాయ‌ప‌డిన‌వారికి వైద్య ఖ‌ర్చుల‌ను సైతం భాదితుల‌కు ఇవ్వలేదు.

అధికారుల నిర్ల‌క్ష్య‌మే ఎక్కువ : సిగాచి యాజ‌మాన్యం

54 మంది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన సిగాచి ప‌రిశ్ర‌మ‌పై తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్ర‌జాప్ర‌యోజ‌న‌ వ్యాజ్యం వేసింది. దీంతోపాటు ప‌లు ర‌కాల కేసులు సిగాచి యాజ‌మ‌న్యంపై విచార‌ణ‌లో ఉన్నవి. కేసు విచార‌ణ‌లో సిగాచి సంస్థ వాద‌న‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల ప‌నితీరును ఇరుకున పెట్టేలా ఉన్నాయి. సిగాచి ప‌రిశ్ర‌మ 2019 నుండి ప్ర‌మాదం జ‌రిగిన 2025 వ‌ర‌కు త‌మ ప‌రిశ్ర‌మ‌లో అన్ని స‌వ్యంగానే ఉన్న‌ట్టు, భ‌ద్ర‌త‌ప‌రంగా లోపాలులేవ‌ని 18 ప్ర‌భుత్వ శాఖ‌లు తేల్చాయని వాదించారు. నిజానికి ప్ర‌మాదంలో త‌మ కంపెనీ నిర్ల‌క్ష్యం కంటే ప్ర‌భుత్వ శాఖల నిర్ల‌క్ష్య‌మే ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పారు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను విడిచిపెట్టి కాకుండా ఏక‌పక్షంగా కేవ‌లం త‌మ కంపెనీ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఎలా చెబుతారని ప్ర‌శ్నించారు. తాము 40 నుంచి 42 లక్షలు ఇస్తున్నామని కోర్టుల ముందు ఒప్పుకుంది. ప్ర‌మాద కార‌ణాల‌ను తెలుసుకొవ‌డానికి వేసిన హై ప‌వ‌ర్ క‌మిటి, నిపుణుల క‌మిటి ..సిగాచి ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో ఆధారాలతో సహా స్పష్టంగా తేలింది. కార్మికుల భ‌ద్ర‌తను ప‌ట్టించుకోలేద‌ని ..అడుగ‌డున ప్ర‌భుత్వ అధికారులు నిర్ల‌క్ష్యం ఉంద‌ని తెల్చి చెప్పింది. ప‌రిశ్ర‌మ‌లో 818 హెచ్‌పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని, అక్రమంగా 1777 హెచ్‌పీకి యంత్రాలను పెంచేశారని. వంద‌లాది మంది కార్మికులు ప‌నిచేసే చోట క‌నీస భ‌ద్ర‌త‌ ప్ర‌మాణాలను పాటించ‌లేద‌ని చెప్పారు. సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదు. ఇంతగా సిగాచి యాజ‌మ‌న్య ప్ర‌భుత్వ అధికారుల నిర్లక్ష్యం, బయటపడినా, ప్రభుత్వం యాజమాన్యం, సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

రేపు బాధిత కుటుంబాలతో మ‌హ‌ధ‌ర్నా : TPJAC

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలంను ప‌రిశీలించిన‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ప్ర‌మాదం జ‌రిగి ప‌ది నెల‌లు గ‌డుస్తున్న ప్ర‌భుత్వ హ‌మీ నెల‌వెర‌లేదు. దింతో అగ్ని ప్ర‌మాద‌ బాధితుల ప‌క్ష‌న ..వారికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ, రూ.1 కోటి రూపాయల పూర్తి పరిహారం సాధించడం కోసం తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ TPJAC ఆధ్వర్యంలో రేపు సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద బాధిత కుటుంబాలతో కలిసి “మహా ధర్నా” నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులనే కంపెనీ పరిహారంగా చూపిస్తూ బాధితులను వంచిస్తోందని, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని నిపుణుల కమిటీ నివేదికలు స్పష్టం చేసినా, ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం శోచనీయమ‌ని TPJAC సంగారెడ్డి జిల్లా క‌న్వీన‌ర్ అశోక్ కుమార్ అన్నారు.

ప్రభుత్వం, యాజమాన్యం కుమ్మక్కు : హ‌రీష్ రావు

యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం ఇవ్వ‌కుండా మోసం చేస్తుంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అరోపించారు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం, 54 మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన రూ. 24.51 కోట్లను విభజించి చూస్తే, ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం రూ. 45.40 లక్షలు మాత్రమేన‌న్నారు. ముఖ్యమంత్రి గ హామీ ఇచ్చిన కోటి రూపాయల పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు రూ. 54.60 లక్షల చొప్పున, మొత్తంగా రూ. 29.48 కోట్ల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని విమ‌ర్శించారు. కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పి, ఇప్పటివరకు తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం త‌రుపున‌ ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు మాత్రమే చెల్లించడం అత్యంత శోచనీయమ‌న్నారు. ప్ర‌భుత్వం ఇస్తుమ‌న్న కొటి రుపాయ‌ల‌ డబ్బు ఎగ్గొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జారుకోవాలని చూస్తోందని, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పేద బాధిత కుటుంబాలను గాలికి వదిలేశారన్నారు హ‌రీష్ రావు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>