కలం, నిర్మల్ : ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించేందుకు నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ సంఘ భవనంలో శుక్రవారం ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. సమగ్ర శిక్ష, తెలంగాణ, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి దాదాపు 200 మంది దివ్యాంగ చిన్నారులు హాజరయ్యారు.
శిబిరంలో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, రోలేటర్లు, చంక కర్రలు, కృత్రిమ కాళ్లు, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్లు, టీఎల్ఎమ్ కిట్లు తదితర ఉపకరణాలను గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు.
ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడనే లక్ష్యంతో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అధికారులు, జిల్లా విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, అలింకో ప్రతినిధులు ప్రత్యుష్, శివ, విలీన విద్య ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

