కలం, నిర్మల్ : గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, మత విద్వేషాలను ప్రేరేపించే పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ (Nirmal) డీఎస్పీ శ్రీనివాస్ (DSP Srinivas) హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, వీడియోలు, మెసేజ్లు, కామెంట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
ఫార్వర్డ్ చేసినా కేసులు తప్పవు
ఇతర మతాల మనోభావాలను కించపరిచేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజల మధ్య ఉద్రిక్తతలకు దారితీసేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎలాంటి కంటెంట్ పోస్టు చేసినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇతరులు పంపిన అభ్యంతరకరమైన లేదా రెచ్చగొట్టే సందేశాలు, వీడియోలను ఫార్వర్డ్ చేసినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

