కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సెప్టెంబర్ 16న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఒకే రోజు నెల్లూరు సిటీ, కోవూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి, పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను అధికారులు విడుదల చేయగా, స్థానిక టీడీపీ నేతలు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం
పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చేరుకోనున్న లోకేశ్ ఉదయం 10 గంటలకు స్టోన్హౌస్పేటలోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం 11:10 గంటలకు మూలపేటలోని డీఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మంత్రి ముచ్చటించి విద్యా రంగానికి సంబంధించిన అంశాలను తెలుసుకునే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. టీడీపీ నేతలతో సమావేశం
మధ్యాహ్నం కోవూరు నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:15 గంటలకు కోవూరు పట్టణంలోని నెల్లూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెన్నై–విజయవాడ హైవే సమీపంలోని వేదికపై కోవూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించే సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై శ్రేణులకు లోకేశ్ దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లను పార్టీ నాయకులు, అధికారులు సమన్వయంతో పూర్తి చేశారు.

