కలం, వెబ్డెస్క్: మతిస్థిమితం సరిగ్గా లేని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. కన్న బిడ్డలను హతమార్చి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా (NTR District) విజయవాడ గ్రామీణ మండల పరిధిలోని పైడూరుపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పైడూరుపాడు గ్రామానికి చెందిన కవిత(34)కు శ్యామ్ అనే వ్యక్తితో 2015లో వివాహం జరిగింది. వీరికి లాస్య(11), సాత్విక్(9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవిత భర్త శ్యామ్ తనకున్న సొంత లారీలు నిర్వహణతో పాటు, సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. కవిత గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం కోసం ప్రయత్నించింది. కానీ ఉద్యోగం రాకపోవడంతో ఇంటి వద్దే ఉంటుంది. అయితే 2020 నుంచి కవిత మానసిక సమస్యతో చికిత్స పొందుతుంది. అయితే కవిత ఎవరినీ కలిసేది కాదని, మాటిమాటికీ చనిపోతానని చెబుతుండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తాను చనిపోతే పిల్లలను ఎవరూ పట్టించుకోరని అభిప్రాయపడ్డ కవిత.. నిద్రిస్తున్న పిల్లల మెడకు చున్నీ బిగించి హత్యచేసింది. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం శ్యామ్ ఇంటికి వచ్చి చూసేసరికి ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

