కలం, స్పోర్ట్స్ : వరుస ఓటములతో కుదేలవుతున్న కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితిపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేకేఆర్కు ఇది ఐదో ఓటమి. ఆ ఒక్క మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దవడంతో ఒక పాయింట్ కేకేఆర్ ఖాతాలో పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ఈ జట్టు ప్రదర్శనపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేకేఆర్ డగౌట్ చెల్లాచెదురైనట్లు కనిపిస్తోందని మనోజ్ తివారీ (Manoj Tiwary) వ్యాఖ్యానించారు. భరత్ అరుణ్, చంద్రకాంత్ పండిట్ వంటి అనుభవజ్ఞులైన కోచ్లను పక్కన పెట్టి, కేవలం పేరున్న పాత ఆటగాళ్లను కోచ్లుగా తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. షేన్ వాట్సన్, టిమ్ సౌథీ గొప్ప ఆటగాళ్లే అయినప్పటికీ, కోచ్లుగా వారికి ఎంత అనుభవం ఉందని ఆయన ప్రశ్నించారు. అలాగే డ్వేన్ బ్రావోను కేవలం స్లో బాల్స్ నేర్పడానికే చెన్నై నుండి తెచ్చుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. పవర్ హిట్టింగ్ కోచ్గా ఆండ్రీ రస్సెల్ను చివరి నిమిషంలో నియమించడంపై కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ గణాంకాలను తివారీ ప్రస్తావించారు. గతంలో నాయర్ పర్యవేక్షణలో ట్రిన్బాగో నైట్ రైడర్స్ (CPL 2022), యూపీ వారియర్స్ (WPL 2026) జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో నిలిచాయని గుర్తు చేశారు. ఇలాంటి పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తిని హెడ్ కోచ్గా నియమించినప్పుడు ప్రశ్నలు రావడం సహజమని ఆయన పేర్కొన్నారు.
వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానేపై ఒత్తిడి పెరుగుతోంది. గత సీజన్లో కూడా ఆయన జట్టును ప్లేఆఫ్స్కు చేర్చలేకపోయారు. అయితే ఈ సీజన్ మధ్యలో నాయకత్వ మార్పు ఉండకపోవచ్చని తివారీ అభిప్రాయపడ్డారు. జట్టులో రింకూ సింగ్, సునీల్ నరైన్ వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, ఈ సీజన్ ముగిసే వరకు రహానేనే కొనసాగించే అవకాశం ఉందని చెప్పారు. ఈ సీజన్ తర్వాత కోచింగ్ స్టాఫ్తో పాటు జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.

