కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే (Manakondur MLA) కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) తెలిపారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం యాదవులపల్లిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాదవులపల్లిలో స్కూల్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనుల పురోగతి, అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, ఇదే వేగాన్ని కొనసాగిస్తే నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరంలోనే పాఠశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
ధనిక వర్గాల పిల్లలకు మాత్రమే పరిమితమైన కార్పొరేట్ స్థాయి విద్యను పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారని చెప్పారు. 2024లో తొలి విడతలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గానికి యాదవులపల్లిలో ఈ పాఠశాల మంజూరైందని తెలిపారు. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో చేపడుతున్న పాఠశాల నిర్మాణ పనులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగుతున్నాయని, నిర్మాణ నాణ్యత, పనుల తీరు బాగుందని ఎమ్మెల్యే అభినందించారు.
నిర్మాణ పనులను చేపడుతున్న మెగా సంస్థ ప్రతినిధులను ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనా విధానాలకు అనుగుణంగా ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ పాఠశాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఎమ్మెల్యే వెంట మెగా ప్రాజెక్ట్ మేనేజర్ అమరేందర్ రెడ్డి, డివిజనల్ ఇంజినీర్ కృష్ణకుమార్, ఏఈ మీస రమేశ్, తహశీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ చెన్నబోయిన రవి, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీగిరి రంగారావు, పులి కృష్ణ, పొన్నాల సంపత్, చింతల లక్ష్మారెడ్డి, పొట్ట శ్రీనివాస్, బుధారపు శ్రీనివాస్, గుంటి మల్లేశం, డాక్టర్ లక్ష్మణ్, పోలు రమేశ్, రాము, రెడ్డిగాని రాజు, పోతుగంటి శ్రీనివాస్, నందగిరి రవీంద్రచారి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రేవెల్లి రాజలింగం, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, చెప్యాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

