కలం, నిజామాబాద్ బ్యూరో: అన్నం పెట్టే అన్నదాత సొంత వ్యవసాయ శాఖ అధికారులకే అలుసుగా మారాడు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఫోన్ చేసి యూరియా గురించి అడిగిన రైతును ఓ వ్యవసాయ అధికారి కఠిన పదజాలంతో దూషించాడు. గాంధారి మండలం(Gandhari) నర్సాపూర్ గ్రామానికి చెందిన సోమరిపేట రవి సోమవారం రాత్రి సుమారు 7:30 గంటలకు గాంధారి వ్యవసాయ అధికారి రాజలింగంకు ఫోన్ చేశారు. యూరియా యాప్లో తన సర్వే నంబర్ను అప్రూవ్ చేయాలని అధికారిని కోరారు. అయితే, రాత్రి సమయంలో ఫోన్ చేయడంపై అధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను అసభ్య పదజాలంతో దూషించారని రవి వాపోయారు. హాలిడే నాడు మేము పార్టీలో ఉంటాం, ఎక్కడో పని మీద ఉంటాం.. రాత్రి టైంలో ఫోన్ చేస్తావా అంటూ తీవ్ర పదజాలంతో బూతుల పురాణం అందుకున్నాడని తెలిపారు.
రైతులు యూరియా, ఎరువుల సమస్యలపై అధికారులను సంప్రదించడం తప్పా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగిగా రైతులతో బాధ్యతాయుతంగా, మర్యాదగా మాట్లాడాల్సిన అధికారి ఇలా దూషించడం సరికాదని రవి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారితో రైతు మాట్లాడిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. రైతును దూషించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని విపక్ష నాయకులు డిమాండ్ చేస్తూ ఘటనను ఖండిస్తున్నారు.

