కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కోర్ట్ విచారణలో ఉన్న కేసులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని మహబూబ్నగర్ (Mahabubnagar) ఎస్పీ డి.జానకి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులు, లైజన్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
కోర్టు విచారణలోని కేసుల్లో సాక్షులు సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో, హత్య, దోపిడీ తదితర కేసుల విచారణలో నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని ఆదేశించారు.
శిక్షలు పడేలా చేయాలి..
కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులు, దర్యాప్తు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయం మరింత మెరుగుపరడాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. నిందితులకు శిక్షలు పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న కోర్టు సమన్లు, వారెంట్లు, ప్రొక్లమేషన్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కేసుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. DCRB డీఎస్పీ రమణా రెడ్డి, సీఐ నర్సింలు, ఐటీ సెల్ ఎస్సై రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

