కలం, వెబ్ డెస్క్: లోక్సభలో మహిళా బిల్లు వీగిపోవడంపై జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) స్పందించారు. బీజేపీ మరోసారి మహిళలను వంచించిందని పేర్కొన్నారు. కుట్రపూరితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ బిల్లుకు అనుసంధానం చేశారని వివరించారు. డీలిమిటేషన్ కు మహిళా రిజర్వేషన్ బిల్లును అనుసంధానిస్తే ప్రతిపక్షాలు అంగీకరించవని తెలిసే బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని ముందుగానే తెలిసినా, అవసరమైన మెజారిటీ లేకపోయినా ప్రభుత్వం తొందరపాటుగా బిల్లును తీసుకొచ్చింది. దేశంలోని మహిళల భావోద్వేగాలను రాజకీయ లాభాల కోసం వినియోగిస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఈ మోసాన్ని మహిళలు గ్రహించి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని Kavitha పిలుపునిచ్చారు. అక్కడ ఒక మహిళే ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి.. 2027 జనగణన వరకు వేచి ఉండి.. ఓబీసీ ఉపకోటాను చేర్చాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

