కలం, వెబ్ డెస్క్: ఆసియాలో రిచెస్ట్ పీపుల్ జాబితాలో పేర్లు మారిపోతున్నాయి. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani)ని వెనక్కి నెట్టి గౌతమ్ అదానీ (Gautam Adani) మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించారు. ఈ మేరకు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూప్నకు చెందిన షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పుంజుకోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 19వ స్థానంలో ఉండగా, 90.8 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ ఆయన తర్వాత స్థానంలో నిలిచారు.
అదానీ గ్రూప్ ప్రధానంగా పోర్టులు, విమానాశ్రయాలు, క్లీన్ ఎనర్జీ ఇంధన రంగాల్లో సాధిస్తున్న వృద్ధి ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. గతంలో హిండెన్బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైనా, మౌలిక సదుపాయాల విస్తరణ, ఇంధన రంగంలో పెట్టుబడుల ద్వారా ఆయన మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. భారత్ నుండి టాప్ 50 ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తులుగా అదానీ, అంబానీ నిలిచారు.

