కలం, వెబ్డెస్క్: గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasena Party) బలంగా పోటీ చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ప్రకటించారు.హైదరాబాద్లోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, జనసేన చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన రాజకీయ భవిష్యత్తుకు ఈ మున్సిపల్ ఎన్నికలు కీలకమని, ఈ ఎన్నికల ఫలితాలే రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశిస్తాయని అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు, ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

