కామన్వెల్త్ బాక్సింగ్: ఫైనల్లోకి అంకుశ్, ప్రీతి!

కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games 2026) బాక్సింగ్‌లో భారత బాక్సర్‌లు  అదరగొడుతున్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ప్రీతి పవార్ (Preeti Pawar), అంకుశ్ పంగల్ (Ankush Panghal) తమ సెమీఫైనల్ పోరులలో అద్భుత విజయాలు సాధించి ఫైనల్‌కి  దూసుకెళ్లారు. దీంతో భారత్‌కు రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి. మహిళల 54 కేజీల విభాగం సెమీఫైనల్‌లో వరల్డ్ నంబర్-3 ప్రీతి పవార్ జాంబియాకు చెందిన కేథరిన్ మ్వాపేపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. 5-0తో ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నారు.

మ్యాచ్ ఆరంభం నుంచే ప్రీతి దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తొలి రౌండ్‌లో జాబ్స్, లెఫ్ట్ హ్యాండ్ పంచ్‌లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. రెండో రౌండ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ పాయింట్లు సాధించారు. చివరి రౌండ్‌లో డిఫెన్స్‌తో పాటు వేగవంతమైన కదలికలతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ప్రీతిని విజేతగా ప్రకటించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత బాక్సర్‌గా ప్రీతి పవార్ రికార్డు సృష్టించారు. స్వర్ణ పతకం కోసం ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో తలపడనున్నారు. మరోవైపు పురుషుల 80 కేజీల విభాగంలో అంకుశ్ పంగల్ కూడా అదిరిపోయే ప్రదర్శన చేశారు. కెనడాకు చెందిన జోషువా ఒఫోరీ పై 5-0తో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించారు.

తొలి రౌండ్ నుంచే పవర్‌ఫుల్ హుక్స్, ఖచ్చితమైన పంచ్‌లతో అంకుశ్ ఆధిపత్యం చూపించారు. రెండో రౌండ్‌లోనూ వ్యూహాత్మకంగా ఆడుతూ పాయింట్లు సాధించారు. చివరి రౌండ్‌లో ప్రత్యర్థి పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ అంకుశ్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. నలుగురు జడ్జీలు 30-26 స్కోర్ ఇవ్వగా, మరొకరు 29-27తో అంకుశ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ విజయంతో అంకుశ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రీతి పవార్, అంకుశ్ పంగల్ తమ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు కనీసం రెండు రజత పతకాలను ఖాయం చేశారు. ఇక ఫైనల్ పోరులోనూ ఇదే జోరు కొనసాగించి స్వర్ణ పతకాలు సాధించాలని భారత క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>