బ్రెజిల్ మ్యాచ్‌కే ఏఐఎఫ్ఎఫ్ మొగ్గు.. ఫిఫా ఆసియన్ కప్‌పై సందిగ్ధం

కలం, స్పోర్ట్స్: కోల్‌కతాలో బ్రెజిల్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ఏఐఎఫ్ఎఫ్ (AIFF) మొగ్గు చూపుతోంది. దీంతో ఫిఫా ఆసియన్ కప్‌లో భారత్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 4 వరకు ఫిఫా ఆసియన్ కప్‌ జరగనుంది. అక్టోబర్ 3న కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో భారత్-బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రెండు టోర్నీల తేదీలు ఒకదానితో ఒకటి తగులుతున్నాయి. ఈ పరిస్థితిలో ఏఐఎఫ్ఎఫ్ రెండో జట్టును పంపాలా, లేక టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకోవాలా అనే అంశంపై చర్చ సాగుతోంది.

గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా మాత్రం ఫిఫా ఆసియన్ కప్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఆ టోర్నీలో భారత్ కంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, వియత్నాం వంటి జట్లతో ఆడే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పాల్గొనేందుకు ఫీజు, విజేతగా నిలిస్తే ప్రైజ్ మనీ కూడా లభించే అవకాశం ఉందని పేర్కొన్నట్లు వెల్లడైంది.

మరోవైపు బ్రెజిల్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించడానికి ఏఐఎఫ్ఎఫ్‌పై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని కూడా ఆయన సూచించినట్లు సమాచారం. 2025 డిసెంబర్‌లో ఎఫ్ఎస్‌డీఎల్‌ ఒప్పందం ముగియడంతో ఐఎస్ఎల్ నుంచి వస్తున్న వార్షిక రూ.50 కోట్ల ఆదాయం ఏఐఎఫ్ఎఫ్‌కు ఇక లేదు. అందుకే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న భారత్, ఆసియన్ కప్‌లో ఇండోనేషియా, మలేసియా, సింగపూర్‌తో ఒకే గ్రూపులో ఉంది.

గ్రూప్ విజేత మాత్రమే తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. ఈ టోర్నీకి రెండో జట్టును పంపేందుకు భారత్ చేసిన విజ్ఞప్తిని ఫిఫా తిరస్కరించినట్లు ఏఐఎఫ్ఎఫ్‌ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ కమిటీకి తెలియజేశారు. అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీలోని మెజారిటీ సభ్యులు బ్రెజిల్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్రెండ్లీ మ్యాచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడినట్లు సమాచారం. తుది నిర్ణయం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>