కలం, వెబ్డెస్క్: కర్ణాటకలోని ఓ జ్యువెల్లరి షాప్లో జరిగిన బంగారం చోరీ (Gold Theft) సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షాప్లో సుమారు రూ.10 లక్షల విలువైన బంగారం చోరీకి గురైంది. అయితే ఈ చోరీ వెనుక ఎవరున్నారని సీసీ కెమెరాలు పరిశీలించగా అందరూ షాకయ్యారు. ఎందుకంటే ఈ దొంగతనం చేసింది ఓ ఎలుక (Rat). వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉన్న విశ్వాస్ జ్యువెల్లర్స్ షాప్లో 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు మాయమయ్యాయి.
దీంతో సిబ్బంది మొదట దీన్ని దొంగతనంగా భావించారు. అయితే, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఒక ఎలుక నోట బంగారు ఉంగరాన్ని పట్టుకుని పరుగెత్తుకెళ్తున్న దృశ్యం కనిపించింది. దీంతో అసలు నిజం బయటపడింది. ఎవరైనా మనుషులు దొంగిలిస్తే కేవలం బంగారాన్ని మాత్రమే తీసుకువెళ్లేవారని, కానీ దుకాణంలో ఆభరణాల ధరల ట్యాగులు కూడా కనిపించకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి సీసీటీవీని పరిశీలించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ దొంగతనంపై వివరాలు తెలుసుకోవడానికి షాప్లో రాత్రిపూట ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు పరిశీలించారు. తెల్లవారుజామున 4:30 గంటలకు ఒక ఎలుక ఉంగరాన్ని నోటపెట్టుకొని తిరుగుతున్న దృశ్యం కనిపించింది. దీంతో దుకాణ సిబ్బంది వెంటనే షాపులో వెతకగా అక్కడ ఎలుకల కన్నాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో తనిఖీ చేయగా కనిపించకుండా పోయిన 10 ఉంగరాలు, గొలుసులు, వాటికి సంబంధించిన ధరల ట్యాగులు అన్నీ అక్కడే దొరికాయి. ఈ ఎలుక దొంగతనం గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

