కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. మండపాల నిర్వాహకులు విద్యుత్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే.. కరెంట్ సరఫరా చేస్తారని వివరించారు. హైదరాబాద్ నగరంలో గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ అసెంబ్లీలోని కాన్ఫరెన్స్ హాల్లో కీలక సమీక్ష చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, డీజీపీ సీవీ ఆనంద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు హాజరయ్యారు.
పోలీసులకు సమాచారం ఇవ్వాలి..
హైదరాబాద్ నగరంలో గణేశ్ మండపాలు ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే, అక్కడకు ఎవరైనా ప్రముఖులు వస్తే కూడా చెప్పాలన్నారు. అనుకోని ఘటనలు జరిగితే.. వెంటనే స్పందించడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. నిమజ్జనం చేసే ప్రతి చెరువు వద్ద క్రేన్స్ అందుబాటులో పెట్టుకోవాలన్నారు.
పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిరంతరం సమీక్షించాలని కమిషనర్లకు సూచించారు. ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వొద్దని, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయనే విషయాన్ని మరిచిపోవద్దని స్పష్టం చేశారు.

