కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ (Chityal) గ్రామం పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలిచేందుకు అడుగులు వేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్తులంతా ఏకమై ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి (Plastic-Free Campaign) శ్రీకారం చుట్టారు. గ్రామాన్ని పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలను చేపట్టేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకట్ రెడ్డి నాయకత్వంలో ప్రజల్లో అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు, పశువులు, మానవ ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాలను గ్రామస్థులకు వివరించి ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, పర్యావరణహిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు.
ఈ నెల 11న భారీ కార్యక్రమం..
ఈ నెల 11న చిట్యాల్ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం (Plastic-Free Campaign) నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై సందేశాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు.
చిట్యాల్ ఆదర్శంగా నిలుస్తుందా?
గ్రామస్థుల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల సహకారంతో చిట్యాల్ గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారితే జిల్లాలోనే కాక రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. గ్రామంలో చేపట్టనున్న ఈ కార్యక్రమం ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఈ రోజే తేలాలి.. డివోర్స్పై పట్టుబట్టిన విజయ్ భార్య!
Follow Us On : WhatsApp

