కలం, పెద్దపల్లి: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఘనంగా నిర్వహించిన 85వ కాన్వకేషన్ వేడుకల్లో భాగంగా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ (TSTS) తొలి చైర్మన్ డా. చిరుమిల్ల రాకేష్ కుమార్ సతీమణి, హైకోర్టు న్యాయవాది డా. చిరుమిల్ల అర్చన (Chirumilla Archana) న్యాయశాస్త్రంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. న్యాయశాస్త్ర విభాగంలో “Settlement of Land Disputes in ADR methods” అనే అంశంపై ఆమె చేసిన విశేష పరిశోధనకు ఈ డాక్టరేట్ లభించింది.
వేడుకల్లో (OU 85th Convocation) భాగంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డా. కృష్ణ ఎల్లా చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్ఠాత్మక పట్టాను స్వీకరించారు. గతంలో తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా సేవలందించిన డా. అర్చన, ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ప్రొఫెసర్ బాణాపురం మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు ఆచార్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. పీహెచ్డీ డాక్టరేట్ పట్టా అందుకున్న డా. చిరుమిల్ల అర్చనకి పలువురు ప్రముఖులు, న్యాయవాదులు, మిత్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

