కలం, వెబ్ డెస్క్ : దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో (Disha Salian Death Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. దిశా తండ్రి సతీష్ సాలియన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, నటుడు డినో మోరియా, రియా చక్రవర్తి, పరంబీర్ సింగ్ తదితరుల పేర్లు పేర్కొంది. దిశా సాలియన్ మృతిపై తనకు అనుమానాలున్నాయని, ఆమెను సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని తండ్రి ఆరోపించారు. ఈ ఆరోపణలను దిశా కుటుంబం తరఫు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎఫ్ఐఆర్లో పేరు ఉన్న వ్యక్తులను దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు నిందితులుగా పరిగణించరాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్లో ఓ భవనం నుంచి పడి మృతి చెందారు. అప్పట్లో ముంబై పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా నమోదు చేసి, అనంతరం ఆత్మహత్యగా పేర్కొన్నారు. తాజాగా కేసును సీబీఐకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దిశా మరణానికి ఆరు రోజుల తర్వాత, జూన్ 14, 2020న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందనే అనుమానాలు అప్పటి నుంచే వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

