కలం, వెబ్డెస్క్: కాపు జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్వహించిన ముద్రగడ సంతాప సభలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ (Bonda Uma) కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ముద్రగడ (Mudragada) రాసిన లేఖల కారణంగానే టీడీపీ ఓటమి పాలైందన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం ముద్రగడ లేఖలను సీరియస్గా తీసుకోలేదని స్పష్టం చేశారు. ముద్రగడ రాస్తున్న లేఖలపై ప్రభుత్వం ఆలోచించాలని, సాధ్యాసాధ్యాలకు ఒక కమిటీ వేసి ఆయనను స్వయంగా పిలిచి చర్చించాలని నాడు అధిష్టానానికి కూడా చెప్పానని బొండా ఉమ అన్నారు. కానీ, కొంతమంది కాపు నాయకులే పద్మనాభం ఆయన ప్రయోజనం కోసం చేస్తున్నారని, ఆయనకు కాపుల్లో అంతగా పట్టు లేదని, ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు కాపు నాయకులే చెప్పారని గుర్తు చేశారు.
ఆ తర్వాత పద్మనాభం ఓ ఉద్యమాన్ని ప్రారంభించి, దాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లారన్నారు. ముద్రగడ పిలుపునిస్తే అన్ని చోట్లా కాపు కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చి శాంతియుత నిరసనలు కూడా చేశారన్నారు. ఆయన ఉద్యమాలు, లేఖల ఫలితంగానే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందన్నారు. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని బొండా ఉమ (Bonda Uma) అన్నారు. త్వరలో విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తామన్నారు. ఈ సంతాప సభకు పార్టీలతకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలు అందరూ హాజరయ్యారు. సభలో బొండా ఉమ, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒకరినొకరు పలకరించుకొని, కలిసి ముద్రగడకు నివాళి అర్పించారు.
Read Also: వరి వేస్తే లాభం లేదు.. రైతులకు సీఎం చంద్రబాబు కీలక సూచన
Follow Us On : WhatsApp

