కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని అంబర్పేట (Amberpet) బాపునగర్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ముగ్గురి ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి వేధింపులకు పాల్పడిన నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను సికింద్రాబాద్ జోన్ డిసిపి రక్షిత కృష్ణమూర్తి మీడియాకు వెల్లడించారు.
బాధితుల నివాసంలో లభించిన ఆత్మహత్య లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డిసిపి తెలిపారు. బాధితుడు తన లేఖలో నలుగురు వ్యక్తుల పేర్లను స్పష్టంగా పేర్కొన్నారని, వారు ఇచ్చిన అప్పుల విషయంలో తీవ్రంగా వేధింపులకు గురిచేశారని వివరించారు. నిందితులను మహమ్మద్ వాజీ, రాజశేఖర్ రెడ్డి, మహమ్మద్ నవాజ్, సయ్యద్ మజీద్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
బాధితులు నిందితుల వద్ద సుమారు 57 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భారీ వడ్డీల పేరుతో నిందితులు ఆ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేశారని, ఆ వేధింపులు భరించలేకే వారు బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

