కలం, తెలంగాణ బ్యూరో : ఫుల్ టైమ్ డీజీపీ (Telangana DGP) నియామకంపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సీనియర్ అధికారుల జాబితా యూపీఎస్సీకి (UPSC) చేరింది. దీన్ని పరిశీలించిన చైర్మన్ త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసే బాధ్యతను మెంబర్కు అప్పజెప్పారు. ముగ్గురితో కూడిన కమిటీ త్వరలో ఏర్పాటు కానున్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఉంటారు. వచ్చే వారం ఈ కమిటీ సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను పరిశీలించి అర్హులైన అధికారుల వివరాలపై చర్చిస్తుంది. యూపీఎస్సీ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలోని అధికారుల వివరాలను స్టడీ చేస్తుంది. ఏవైనా సందేహాలున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరవుతున్న చీఫ్ సెక్రటరీ నుంచి వివరణ తీసుకుంటుంది.
సీవీ ఆనంద్కు అవకాశాలు ఎక్కువ :
రాష్ట్ర ప్రభుత్వం నలుగురి పేర్లను జాబితాలో పెట్టింది. ప్రస్తుతం హోం శాఖ సెక్రటరీగా ఉన్న 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్తో పాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్యా మిశ్రా పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో ముగ్గురి పేర్లను ఈ కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. అందులోంచి ఒకరిని ముఖ్యమంత్రి ఫుల్ టైమ్ డీజీపీగా ప్రకటించనున్నారు. మిగిలిన ముగ్గురితో పోలిస్తే సీవీ ఆనంద్ (CV Anand) సీనియర్ కావడంతో ఫుల్ టైమ్ డీజీపీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాతి వరుసలో ఉన్న అధికారులకు అవకాశం లభిస్తుంది. సీవీ ఆనంద్ మాత్రం ఉత్తర్వులు వెలువడేంత వరకు ఎలాంటి నిర్ణయమైనా జరగొచ్చని, దానిపై ఇప్పటికిప్పుడు అంచనా రావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని తన సన్నిహితులతో ఇటీవల పంచుకున్నట్లు తెలిసింది.
శివధర్రెడ్డికి అవకాశం లేనట్లే ! :
మరోవైపు ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్రెడ్డి (DGP Shivadhar Reddy) పదవీకాలం ఏప్రిల్లో ముగుస్తున్నందున యూపీఎస్సీ పెట్టిన ‘ఆరు నెలల సర్వీసు’ నిబంధనకు అర్హత లేకుండా పోయింది. దీంతో ఆయనకు ఫుల్ టైమ్ డీజీపీ అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే ఆయన ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం. గతేడాది అక్టోబరు నుంచి డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా యూపీఎస్సీ నిబంధనలతో పాటు హైకోర్టులో దాఖలైన పిటిషన్, దాన్ని విచారించి బెంచ్ వెల్లడించిన ఉత్తర్వులు ఫుల్ టైమ్ డీజీపీగా (Telangana DGP) ఉతర్వులు వెలువడడంలో అడ్డంకిగా మారాయి. వచ్చే వారం ఢిల్లీలో జరిగే యూపీఎస్సీ కమిటీ సమావేశం తర్వాత స్పష్టత రానున్నది. రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే షార్ట్ లిస్టు వచ్చే అవకాశమున్నది.
Read Also: ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం రియాక్షన్
Follow Us On: Instagram

