కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో ఆహార కల్తీ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. హైదరాబాద్ నగరంలో అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కల్తీని అరికట్టలేకపోతున్నారు. రోడ్ల పక్కన దొరికే చిరుతిళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా కల్తీ దందా రాజ్యమేలుతోంది. తాజాగా నగరంలో మరో కొత్త కల్తీ వ్యవహారం వెలుగుచూసింది. హైదరాబాద్లోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో నకిలీ టీ పౌడర్ (Fake Tea Powder) తయారు చేస్తున్న ఓ ముఠాను గుర్తించారు. ఫేక్ టీ పౌడర్ తయారీకి పాల్పడుతున్న జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
జగన్నాథ్ బిష్ణోయ్ సింథటిక్ రసాయనాలతో టీ పౌడర్ తయారు చేస్తున్నాడు. ఒక కిలో కల్తీ టీ పొడికి 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్ వస్తుంది. 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్తో పాటు 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ మిక్స్తో దీన్ని రూపొందిస్తున్నారు. దీన్ని నగరంలో పలు దుకాణాలకు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు.

