కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం (Visakhapatnam)లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి తనను వదిలేశాడన్న బాధతో రజిని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మధురవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఫిజియోథెరపీ రెండో సంవత్సరం చదువుతున్న రజిని, తాను ప్రేమించిన వ్యక్తి దూరం కావడాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
మరణానికి ముందు రజిని ఒక భావోద్వేగపూరితమైన సూసైడ్ నోట్ రాసింది. అందులో తన ప్రేమికుడిని మర్చిపోలేకపోతున్నానని తెలిపింది. ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నందుకు తనను క్షమించాలని తల్లిదండ్రులను వేడుకుంది. యువతి మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

