కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారులను భారీగా బదిలీ (IAS Officers Transfers) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబర్ 290 ద్వారా మొత్తం 45 మంది అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఎం. దాన కిషోర్ విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు చేపట్టనుండగా, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ సెక్రటరీగా డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఈ. శ్రీధర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు.
విద్యుత్ శాఖలో కూడా ముఖ్యమైన మార్పులు జరిగాయి. టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) సీఎండీగా జితేశ్ వి. పాటిల్, కొత్తగా ఏర్పాటు చేసిన మూడవ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ ఫారూఖీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇతర కీలక నియామకాల్లో సిక్తా పట్నాయక్ ఫైనాన్స్ సెక్రటరీగా, పమేలా సత్పతి లేబర్ కమీషనర్గా, రాహుల్ రాజ్ కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను కూడా ప్రభుత్వం కేటాయించింది.
జిల్లాల వారీగా కొత్త కలెక్టర్లను పరిశీలిస్తే, యాదాద్రి భువనగిరికి అనురాగ్ జయంతి, జనగామకు సందీప్ కుమార్ ఝా, జోగులాంబ గద్వాలకు రిజ్వాన్ బాషా షేక్, నారాయణపేటకు ప్రతీక్ జైన్, మహబూబాబాద్కు స్నేహ శబరీష్ కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. మహబూబ్నగర్ కలెక్టర్గా ఉన్న బి. విజయేంద్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అలాగే ఎం. హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్గా, సంతోష్ బి.ఎం. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమితులయ్యారు.
Read Also: రైల్వే టికెట్ క్లర్క్కి బుద్ధి చెప్పిన యువతి.. ఉద్యోగమే ఊడిపోయింది!
Follow Us On: X(Twitter)

