కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరం సనత్నగర్ (Sanathnagar) పరిధిలో హత్య కలకలం రేగింది. ఓ హోటల్లో పనిచేస్తున్న శంకర్ అనే వ్యక్తిని బసవరాజు అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న పాత కక్షలతో పాటు వివాహేతర సంబంధం ఈ ఘర్షణకు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో బసవరాజు తన వద్ద ఉన్న కత్తితో శంకర్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శంకర్ తుది శ్వాస విడిచాడు.
సమాచారం అందుకున్న సనత్నగర్ (Sanathnagar) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు బసవరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

