కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు (Telangana Intermediate Exams) మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1495 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి.
ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, ఈసారి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు ఆదేశించారు. దీనివల్ల ట్రాఫిక్ లేదా ఇతర కారణాలతో స్వల్పంగా ఆలస్యమైన విద్యార్థులకు ఊరట లభించనుంది.
మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 4,89,126 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులు ఉండగా, 5,07,949 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు సజావుగా సాగేలా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

