కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్ సమర్పించిన దరఖాస్తుల్లో స్వల్ప తేడాలున్నట్లు గుర్తించిన ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చింది. సరైన వివరాలతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సుప్రీం కోర్టు మాజీ జడ్జి రంజనా దేశాయ్ సహా పలువురు ప్రముఖులకు నోటీసులు వెళ్లాయి. మాజీ ఉప ప్రధాని ఎల్.కే. అద్వాణి కుటుంబ సభ్యులు సైతం నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.
ఓట్లు తొలగించినట్లు కాదు..
వారి వివరాలు ఇంతకుముందున్న ఓటర్ల జాబితాలో పేర్కొన్న వివరాలతో సరిపోలడం లేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నాయి. దీనిపై ఢిల్లీ ఎన్నికల అధికారి స్పందిస్తూ.. సర్ ప్రక్రియలో భాగంగా సాధారణంగానే అందరికీ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. నోటీసులు పంపించడమంటే.. ఓటు తొలగించడం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. సరైన వివరాలతో మరోసారి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. ప్రముఖులకు నోటీసులు రావడంతో సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా చర్చకు దారి తీసింది.

