కలం, స్పోర్ట్స్: ఆక్లాండ్లో జరిగిన ఒక ప్రచార కార్యక్రమ చిత్రీకరణలో న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర (Rachin Ravindra) ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. ఈ పరిణామంతో అక్టోబర్ 22 నుంచి భారత్తో ప్రారంభం కానున్న ఐదు T20ల సిరీస్లో ఆయన భాగస్వామ్యం అనుమానంగా మారింది. బుధవారం జరిగిన షూటింగ్లో డైవింగ్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తుండగా రచిన్ సేఫ్టీ మ్యాట్పై సరిగా ల్యాండ్ అవ్వలేదు. ఈ క్రమంలో ఆయన కుడి భుజం డిస్లొకేట్ అయింది. శుక్రవారం వైద్య నిపుణులు ఆయనను పరీక్షించి, పెద్దగా ప్రమాదకరమైన లోపాలు లేవని స్పష్టం చేశారు.
అయితే, రాబోయే వారాల్లో జరిగే కోలుకునే ప్రక్రియ (రీహాబ్) ఆధారంగానే ఆయన తిరిగి జట్టులోకి వచ్చేది ఆధారపడి ఉంటుందని న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనపై న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ మేనేజర్ మైక్ శాండ్లే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తగిన భద్రతా చర్యలతోనే షూటింగ్ నిర్వహించినప్పటికీ ఇది ఒక దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. రచిన్ త్వరగా కోలుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష చేస్తామని చెప్పారు.
అటు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ.. రాబోయే ఆరు నెలల్లో తమకు ముఖ్యమైన టెస్ట్ సిరీస్లు ఉన్నాయని గుర్తుచేశారు. అందుకే రచిన్ను తొందరపడి మైదానంలోకి దించలేమని, పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించిన తర్వాతే జట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రచిన్ రవీంద్ర కీలక ఆటగాడిగా ఉన్నారనడంలో సందేహం లేదు.
ఆయన ఇప్పటివరకు 52 T20 మ్యాచుల్లో 759 పరుగులు చేయడంతో పాటు, 26 వికెట్లు సాధించారు. వచ్చే వారం భారత్తో పోరుకు న్యూజిలాండ్ జట్టును ప్రకటించే అవకాశముంది. ప్రపంచ ఛాంపియన్ అయిన భారత్ను ఎదుర్కొనే ఈ సిరీస్కు మిచెల్ శాంట్నర్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. రచిన్ కోలుకునే స్థితిని బట్టి ఆయనను సిరీస్కు ఎంపిక చేయాలా వద్దా అనే దానిపై బోర్డు స్పష్టత రానుంది.

