కలం, స్పోర్ట్స్: ఆసియా గేమ్స్ (Asian Games) ప్రారంభానికి ముందే భారత్కు వసతి సమస్యలు ఎదురయ్యాయి. జపాన్ చేరుకున్న తర్వాత భారత బృందం (Indian team) వసతి కోటా తగ్గినట్లు సమాచారం అందుకుంది. దీంతో వెంటనే అదనపు హోటల్ రూములు బుక్ చేయాల్సి వచ్చింది. భారత్ చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం భారత అథ్లెట్లకు వసతి విషయంలో సమస్య లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 18 అదనపు రూములు బుక్ చేశారు. మరో 10 రూములను కూడా అదే రోజు బుక్ చేయనున్నట్లు తెలిపారు. వసతి కొరత మాత్రం ఉందని ఆయన స్పష్టం చేశారు.
అక్రిడిటేషన్ ప్రక్రియ కూడా ఎక్కువ సమయం తీసుకుంటోంది. రవాణాలోనూ కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భారత బృందం సొంతంగా కార్లు, హోటళ్లను ఏర్పాటు చేసుకుంది. భారత బృందం సమస్యలపై నిందలు వేయడం కంటే అథ్లెట్ల సౌకర్యానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సహదేవ్ యాదవ్(Sahdev Yadav) తెలిపారు. వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసియా గేమ్స్ అధికారిక ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు ఈ సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
శుక్రవారం భారత్ సహా ఐదు బృందాల జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఆలస్యమైంది. 20 నిమిషాల ఆలస్యంతో ప్రారంభమైన కార్యక్రమం తర్వాత మళ్లీ నిలిచిపోయింది. ఈ అంతరాయానికి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఎగ్జిక్యూటివ్ బోర్డు, ఆర్గనైజింగ్ కమిటీ మధ్య కమ్యూనికేషన్ సమస్య కారణమని నిర్వాహకులు తెలిపారు. తర్వాత కార్యక్రమం పూర్తయింది. భారత్ తరఫున అంజలి భగవత్, లిజో డేవిడ్ తొట్టన్ పాల్గొన్నారు.

