కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) నేటి యువతరం పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ధర్మం అనేది కేవలం వృద్ధులకే పరిమితం అనే భావనను పటాపంచలు చేస్తూ, నేటి యువత కూడా ధర్మం గురించి చర్చిస్తుండటం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మాధవ్ విజ్ఞాన్ మహావిద్యాలయ వేదికగా ‘సేవాజ్ఞ సంస్థానం’ ఆధ్వర్యంలో నిర్వహించిన “యువ ధర్మ సంసద్(Yuva Dharma Sansad)” కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొని ప్రసంగించారు.
స్వామి వివేకానంద చారిత్రాత్మక షికాగో ప్రసంగం జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. ధర్మం అనేది కేవలం ఏదో ఒక పూజ, లేదంటే ఆచారానికి సంబంధించిన నిర్దిష్ట మతం కాదని, అది సర్వమానవాళికి వర్తించే మతాతీతమైన శాశ్వత జ్ఞానమని తెలిపారు. ధర్మం అనేది భారతీయుల DNA లోనే ఉందని చెప్పారు. భారతీయుల జీవన విధానం, సాంస్కృతిక మూలాల్లోనే ధర్మం దాగి ఉందని స్పష్టం చేశారు. అయితే సాధారణంగా యువత ధార్మిక అంశాలకు దూరంగా ఉంటుందనే అపోహ సమాజంలో ఉందనీ, కానీ నేటి GenZ యువత సైంటిఫిక్ దృష్టితో, తార్కికంగా ధర్మం గురించి తెలుసుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామమని కొనియాడారు.
అలాగే ధర్మానికి ఉన్న నిజమైన అంతరార్థాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే, యువత ముందుగా తమ మనస్సుల్లో ఉన్న పాత అపోహలను, పక్షపాతాలను పూర్తిగా వీడాలని మోహన్ భాగవత్ (Mohan Bhagwat) దిశానిర్దేశం చేశారు. కాగా, సుమారు 1,700 మందికి పైగా విద్యార్థులు, యువత పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, ఆధునిక జీవనశైలిలో ధర్మ ప్రాముఖ్యతపై విస్తృత చర్చ జరిగింది.
Also Read : సిద్దిపేటకు రావడానికి అంత భయమెందుకు?: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

