కలం, కరీంనగర్ : కరీంనగర్లో(Karimnagar) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సిపిఎం (CPM Leaders) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్ రావు (Anabheri Prabhakar Rao) విగ్రహం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టు పార్టీ నాయకులేనన్నారు. సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. పోరాటాన్ని హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
నిజాం నిరంకుశ పాలనలో పటేల్, పట్వారి, జమిందార్లు, రజాకార్లు, జాగీర్దార్ వ్యవస్థకు వ్యతిరేకంగా.. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరిగిందన్నారు. సుందరయ్య మార్గదర్శకత్వంలో అనేక మంది కమ్యూనిస్టు నాయకులు పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. పోరాటం ఫలితంగా సుమారు 4 వేల గ్రామాలకు విముక్తి లభించిందని, దాదాపు 11 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచినట్లు పేర్కొన్నారు. సాయుధ రైతాంగ పోరాట యోధుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

