కలం, స్పోర్ట్స్ : వెస్టిండీస్తో (IND vs WI Series ) జరగబోయే వన్డే, టీ20 సిరీస్లకు భారత జట్టును ఎంపిక చేసేందుకు నేడు సెలెక్టర్లు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాల ఎంపికే ప్రధానాంశంగా మారనుంది. భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 27 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆసియా క్రీడల్లో ఆడే టీ20 జట్టునే ఈ సిరీస్కూ కొనసాగించే అవకాశం ఉంది. అయితే వన్డే జట్టు ఎంపిక సెలెక్టర్లకు సవాలుగా మారింది. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 6 నుంచి జరిగే ‘ఇండియా-ఎ’ సిరీస్కు ఆయన ఇప్పటికే ఎంపికయ్యారు.
కానీ, వెస్టిండీస్తో వన్డేల్లో ఆయనతో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయించవచ్చా లేదా అన్నది సెలెక్టర్లు తేల్చాల్సి ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, వెంకటేష్ అయ్యర్ లాంటి ఆల్రౌండర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందిగా మారింది.ఐపీఎల్లో విఫలమైన పంత్ వైట్బాల్ జట్టులో చోటు కోల్పోయారు. ఇషాన్ కిషన్ ఆసియా క్రీడలకు వెళ్తుండటంతో పంత్కు మళ్లీ అవకాశం దక్కవచ్చు. వన్డేల్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా వ్యవహరిస్తారు. ఒకవేళ పంత్ ఎంపిక కాకపోతే ధ్రువ్ జురెల్ను తీసుకుంటారు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, రిజర్వ్ బ్యాటర్గా రజత్ పటీదార్లకు చోటు దక్కే అవకాశం ఉంది.
రవీంద్ర జడేజా తిరిగి వన్డే జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గాయాల కారణంగా అక్షర్ పటేల్, హర్ష్ దూబే అందుబాటులో లేరు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్లతో వేగవంతమైన బౌలింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయవచ్చు. సీనియర్లు షమీ, చాహల్లను మళ్లీ పరిశీలించే అవకాశం తక్కువగానే ఉంది. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనుంది. ఆయన పదవిని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ పెద్దలతో చర్చించనున్నారు.

