కలం, నారాయణపేట : కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని, దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదనీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ అన్నారు. శనివారం నారాయణపేట (Congress Narayanpet) సివిఆర్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ మాట్లాడారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగబద్ధ పదవిని అవమానించడమేనన్నారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలు, రాజ్యాంగ పదవులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. స్పీకర్ పదవి ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, అది రాజ్యాంగబద్ధమైన అత్యున్నత బాధ్యతన్నారు. దళిత నాయకుడికి స్పీకర్గా అవకాశం కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అలాంటి పదవిని అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికే అవమానమని స్పష్టం చేశారు. ఏ పార్టీకి చెందిన నాయకుడైనా రాజ్యాంగ పదవులకు గౌరవం ఇవ్వాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే పదవి నుండి భర్తరఫ్ చేయాలని, మళ్లీ పోటీ చేయకుండా అనర్హవుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేయాలని కోరారు.
డీసీసీ అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రతిపక్ష నేత కేసీఆర్కు తెలంగాణ ప్రజల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ లో ఉంటూ వారిపార్టీ కి చెందింన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో రెచ్చ గొట్టే విధంగా కుట్రలు చేయడం మానుకోవాలన్నారు. దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దళితుల సోదరులు ఫామ్ హౌస్ ముట్టడి చేస్తే పసుపు నీళ్లు చల్లి శుద్ధికరణ చేయడం హెయమైన చర్య అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణపై చేసిన భారీ అప్పులు, వేల కోట్ల రూపాయల ఖర్చుపై ప్రజలకు లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించకుండా బయట నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. తెలంగాణను రాజకీయ కలహాలకు వేదికగా కాకుండా అభివృద్ధి దిశగా నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు.

