కలం, సత్తుపల్లి : శ్రామిక వర్గాల సంక్షేమం, అణగారిన ప్రజల హక్కుల కోసం నిరంతరం శ్రమించిన మార్క్సిస్టు మేధావి, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయ సాధనకు ప్రజాపోరాటాలే నిజమైన నివాళి అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు స్పష్టం చేశారు. శనివారం పెనుబల్లి మండల కేంద్రంలో సీపీఎం (CPM) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏచూరి వర్ధంతి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఏచూరి దార్శనికత అసాధారణమైనదని విఠల్రావు కొనియాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఐక్య పోరాటాల ద్వారానే తిప్పికొట్టగలమని పిలుపునిచ్చారు.
సభలో సీపీఎం (CPM) మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు మాట్లాడుతూ.. పార్లమెంట్లో శ్రామిక వర్గం గొంతుకగా నిలిచిన ఏచూరి, ‘ఇండియా’ కూటమి ఏర్పాటులోనూ, ఉపాధి హామీ, అటవీ హక్కుల చట్టాల అమలులోనూ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఏచూరి స్ఫూర్తితో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిమోదు కృష్ణయ్య, అఖిల్, కాటినేని తదితరులు పాల్గొన్నారు.

