కలం, మెదక్ బ్యూరో: వ్యవసాయానికి అరకొర విద్యుత్ సరఫరా చేస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిద్దిపేట (Siddipet) రూరల్ మండలం రాఘవపూర్ (Raghavapur) వద్ద రైతులు శుక్రవారం భారీ ధర్నా (Farmers Protest) చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న 8 గంటల విద్యుత్ ఏమాత్రం సరిపోవడం లేదని, వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు.
నిరసన తెలిపే క్రమంలో రోడ్డుపై టైర్లకు నిప్పు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరిపడా కరెంట్ లేక పొలాలు ఎండిపోయి తాము తీవ్రంగా నష్టపోతున్నామని, అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన 24 గంటల విద్యుత్ను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

