కలం, నిర్మల్: ముదిరాజ్ కులస్తులను బీసీ-D నుంచి బీసీ-Aలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిర్మల్ (Nirmal) జిల్లాకు చెందిన పలువురు ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో ముదిరాజ్ కులస్తులను బీసీ-Aలోకి మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని వారు ఆరోపించారు.
ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఎన్ని అరెస్టులు చేసినా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ముందస్తు అరెస్టయిన వారిలో ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటకారి సాయన్న, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు హరీష్ సుంకరి పోతన్న, బర్మ చిన్నయ్య, గంగాధర్ తదితరులున్నారు.

