కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పే రివిజన్ కమిషన్ (Employees PRC) నివేదిక దాదాపు రెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు చైర్మన్ ఎన్.శివశంకర్ (రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్) తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 14న చీఫ్ సెక్రటరీకి సమర్పించనున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సంకేతాలిచ్చారు. ఏదేని పరిస్థితుల్లో ఆలస్యమైతే మరుసటి రోజున అంటే సెప్టెంబరు 15న సమర్పించనున్నట్లు తెలిపారు. పీఆర్సీ నివేదికను వెంటనే ప్రభుత్వం తెప్పించుకోవాలంటూ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు గత నెలలోనే చీఫ్ సెక్రటరీని కలిసి వివరించారు.
తాజాగా బుధవారం సైతం సీఎస్తో భేటీ అయ్యి చర్చించారు. వీలైనంత తొందరగా సమర్పించాల్సిందిగా పీఆర్సీ చైర్మన్కు లేఖ రాసిన సంగతిని ఆ ప్రతినిధులకు సీఎస్ వివరించారు. అందులో భాగంగా జేఏసీ ప్రతినిధులు గురువారం ఉదయం పీఆర్సీ చైర్మన్ను ఆయన కార్యాలయంలో కలిసి నివేదికను సమర్పించే విషయమై చర్చించారు. రిపోర్టు దాదాపుగా కొలిక్కి వచ్చిందని, సెప్టెంబరు 14 లేదా 15 తేదీల్లోపు ఇస్తామని వారికి స్పష్టం చేశారు. ఈ నెల 18న మరోమారు జేఏసీ ప్రతినిధులు, చీఫ్ సెక్రటరీ భేటీ కానున్న నేపథ్యంలో పీఆర్సీ చైర్మన్తో సమావేశమై పురోగతి గురించి తెలుసుకోవడం గమనార్హం.

