కలం, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా భూత్పూర్ జాతీయ రహదారి (Bhuthpur Highway) పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున గొర్రెల లోడుతో హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్, సూచిక బోర్డు, విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు వాహనంలోని డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. క్షణాల వ్యవధిలోనే వాహనం మొత్తం మంటలు చిక్కుకుంది.
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సుమారు 200కు పైగా గొర్రెలు సజీవ దహనమయ్యాయి. డీసీఎంలో ఉన్న డ్రైవర్ రషీద్ ఖాన్ వాహనం నుంచి బయటకు దూకేసి ప్రాణాలతో బయటపడ్డాడు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, హైవే సిబ్బంది సమాచారం అందించడంతో అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

