కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో గురువారం కీలక చర్చ జరగబోతుంది. 22ఏ నిషేధిత భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వబోతుంది. ఎన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు ఎన్ని భూములను క్లియర్ చేశారనే వివరాలను సభ ముందు ఉంచబోతుంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు కూడా సమాధానం ఇవ్వబోతుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చను ప్రారంభించబోతున్నారు.
భూములపై బీజేపీ పట్టు..
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజు నుంచే నిషేధిత భూముల అంశంపైనే బీజేపీ పట్టుబడుతోంది. దీనిపై సమగ్ర చర్చ జరగాల్సిందేనని బీఏసీ సమావేశంలో కూడా స్పష్టం చేసింది. మొదట్లో ప్రభుత్వం నిరాకరించినా.. ఆ తరువాత అంగీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా సభకు హాజరై చర్చలో మాట్లాడే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.

